ఆ సబ్జెక్ట్ గురించి మంత్రి నారా లోకేశ్ గారికి విజ్ఞప్తి చేశాను: నారా భువనేశ్వరి

  • కుప్పం విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి
  • నాన్న వీధిదీపాల కింద చదివారు, చంద్రబాబు కిలోమీటర్లు నడిచారని వెల్లడి
  • పిల్లలకు సెల్ ఫోన్లు అధికంగా ఇవ్వొద్దు, టెక్నాలజీ అవసరానికే వాడాలని సూచన
  • అహంభావం వద్దు, తల్లిదండ్రులను గౌరవించాలని విద్యార్థులకు హితవు
విద్యార్థులకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ నేర్పించడం ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు అర్ధాంగి, హెరిటేజ్ ఫుడ్స్ అధినేత నారా భువనేశ్వరి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాల్యం గ్రామంలో మంగళవారం జరిగిన 'విలువల బడి' కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ, తన తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబుల బాల్యంలోని కష్టాలను గుర్తుచేసుకుంటూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఉన్నత స్థానాలకు చేరడానికి వారు పడిన శ్రమను విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడుతూ, "విద్యార్థులను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మా చిన్నప్పుడు 'మోరల్ సైన్స్' అనే సబ్జెక్ట్ ఉండేది. కానీ కాలక్రమేణా దాన్ని తీసేశారు. పాఠశాలల్లో ఆ సబ్జెక్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేశ్ గారికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాను" అని తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ గురించి చెబుతూ, "మా నాన్నగారు ఓ పేద కుటుంబంలో పుట్టి, కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చిన్నప్పుడు సైకిల్‌పై ఇల్లిల్లూ తిరిగి పాలు అమ్మేవారు. వీధిదీపాల కింద కూర్చొని చదువుకున్నారు" అని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.

అదేవిధంగా, తన భర్త చంద్రబాబు నాయుడు కూడా చిన్నతనంలో కిలోమీటర్ల దూరం నడిచి బడికి వెళ్లేవారని, వారు ఎదిగిన తీరు తనకు గర్వకారణంగా ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల పెంపకంలో తల్లి పాత్ర అత్యంత కీలకమని, తన తల్లి తమకు విలువలు నేర్పి పెంచిందని వివరించారు.

ఆధునిక టెక్నాలజీ వినియోగంపై ఆమె కీలక సూచనలు చేశారు. "పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకూడదు. ఒకే ఇంట్లో ఉండి కూడా కుటుంబ సభ్యులకు ఫోన్లలో మెసేజ్‌లు పంపుకునే పరిస్థితి వచ్చింది. టెక్నాలజీని అవసరానికి మాత్రమే వాడుకోవాలి. మా చిన్నతనంలో ఫోన్లు, టీవీలు లేకపోవడం వల్లే సంతోషంగా గడిపామనిపిస్తుంది" అని అన్నారు. 'అన్నీ మాకే తెలుసు' అనే అహంభావం ఎవరికీ ఉండకూడదని, అహంకారం మనల్ని పాతాళానికి నెట్టేస్తుందని హితవు పలికారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ, తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవ్వడంతో మనుషుల మధ్య దూరం పెరిగిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Nara Bhuvaneswari
Nara Lokesh
Moral Science
Values Education
Kuppam
Chandrababu Naidu
NTR
Heritage Foods
Student Education
Technology Usage

More Telugu News